Andhra News: సీపీఎస్ రద్దుపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ.. హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు
అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అంశంపై చర్చించేందుకు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఉన్నతాధికారులు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.
సీపీఎస్ రద్దుపై తొలిసారి భేటీ జరుగుతున్న నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా పీఆర్సీపై పెండింగ్లో ఉన్న జీవోలనూ విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లు సమాచారం. పెండింగ్ అంశాలు వెంటనే పరిష్కరించాలని.. సీపీఎస్ రద్దు చేస్తేనే అంగీకారమని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరనున్నట్లు చెప్పారు. రద్దు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలేవీ అంగీకరించబోయేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.