Trending

6/trending/recent

Fake Notes: బ్లాక్ కరెన్సీ పేరుతో కొత్త రకం మోసం

బ్లాక్ కరెన్సీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కెమికల్స్ ఉపయోగించి బ్లాక్ కరెన్సీని ఒరిజినల్ నోట్లుగా మార్చొచ్చని చెప్పి గుంతకల్లు చుట్టుపక్కల వారిని మోసం చేసే గ్యాంగ్ కటకటాల పాలైంది.

  • బ్లాక్ కరెన్సీ మారుస్తున్న ముఠా అరెస్టు
  • కెమికల్స్‌తో బ్లాక్ నోట్లను ఒరిజినల్‌గా మార్చొచ్చని నమ్మబలికిన నిందితులు
  • ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి.. రూ.3.8 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఒక్కసారి మోసాలకు అలవాటు పడితే ఇక జీవితాంతం వాటికి బానిస అవుతారు అనేందుకు ఇతనే ఉదాహరణ.. డీ ఫార్మసీ చదివిన అతను.. అగ్రిగోల్డ్‌లో ఏజెంట్‌గా చేసి అప్పులపాలయ్యాడు.. వాటి నుంచి కోలుకోడానికి రైస్ పుల్లింగ్ ముఠాతో చేతులు కలిపి.. ఇప్పుడు బ్లాక్ కరెన్సీ పేరుతో ప్రజలను మోసం చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు.

కర్నూలు జిల్లా కోసిగి గ్రామానికి చెందిన 33 సంవత్సరాల దాస నరేష్ కుమార్ జనాల్ని మోసం చేయడంలో దిట్ట. డీ ఫార్మసి చదివిన నరేష్ అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా పనిచేసి.. అప్పులు చేసి మరీ డిపాజిట్లు కట్టించి.. ఆర్థికంగా నష్టపోయాడు. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి రైస్ పుల్లింగ్ ముఠాలతో పరిచయాలు పెంచుకుని అక్రమంగా డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలని భావించాడు. ఈ క్రమంలోనే బ్లాక్ కరెన్సీని మార్కెట్‌లో మారిస్తే మంచి లాభాలు వస్తాయని తెలుసుకున్నాడు.

కెమికల్స్ ఉపయోగించి బ్లాక్ కరెన్సీని ఒరిజినల్ నోట్లగా మార్చవచ్చని తెలుసుకున్న నరేష్ కుమార్.. చిత్తూరు జిల్లాకు చెందిన దొరస్వామిరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన కృష్ణ అనే మరో ఇద్దరు నిందితులతో కలిసి ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు.. బ్లాక్ కరెన్సీ నోట్లు గోవాలో రిజర్వ్ బ్యాంక్ నోట్లు ముద్రించే ఫ్యాక్టరీ నుంచి తెచ్చామంటూ చెప్పి.. ప్రజలను మోసం చేసేవాడు. బ్లాక్ కరెన్సీపై కెమికల్ వేస్తే అవి ఒరిజినల్‌ నోట్లుగా మారతాయని చెప్పి.. నోట్ల కట్టలో నాలుగు ఒరిజినల్స్ ఉంచి మిగతావి ఫేక్ నోట్లు పెట్టి ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది.

ఒక ఒరిజినల్ నోటుకు నాలుగు బ్లాక్ కరెన్సీ నోట్లు ఇస్తామని చెప్పి గుంతకలు పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఏకంగా రూ.3.8 లక్షల బ్లాక్ కరెన్సీ మార్చారని.. దీంతో వీరిపై అనేక ఫిర్యాదులు రావడంతో అనంతపురం ఎస్పీ ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రధాన నిందితుడు నరేష్ కుమార్‌తో పాటు దొరస్వామిరెడ్డి, కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.3,80,000 నగదు, కారు, 38 బ్లాక్ పేపర్ల కట్టలు, 3 సెల్ ఫోన్లు, కెమికల్ పూత పూసి బ్లాక్‌గా చేసిన ఒరిజినల్ 500 రూపాయలు నోట్లు 3, కెమికల్స్ స్వాధీనం చేసుకున్నట్లు గుంతకల్లు పోలీసులు వెల్లడించారు.

Fake Notes: బ్లాక్ కరెన్సీ పేరుతో కొత్త రకం మోసం


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad