ప్రజలు కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించకపోవడం వల్లనే కొత్తగా కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదవుతున్నాయని సీఎం అధికారులకు చెప్పారు. అందువల్ల లాక్డౌన్ లాంటి నిబంధనలను అమలు చేయక తప్పదని...
ముంబై: దేశవ్యాప్తంగా కరోనా మరోమారు విజృంభిస్తోంది.
అక్టోబర్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆదివారం నాడు కరోనా కేసులు నమోదు కావడం
ఆందోళన కలిగించే విషయం. ఇవాళ ఒక్కరోజే భారత్లో కొత్తగా 62,714 కరోనా
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో మెజార్టీ
పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం
అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే
ఆదివారం వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా
వైద్యాధికారులకు సీఎం ఉద్ధవ్ థాక్రే కీలక సూచన చేశారు. మహారాష్ట్రలో ప్రజలు
ఇలానే కోవిడ్-19 నిబంధనలను తుంగలో తుక్కి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..
లాక్డౌన్ తరహాలో కఠిన నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమవ్వాలని ఆయన
అధికారులకు సూచించారు. ప్రజలు కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించకపోవడం
వల్లనే కొత్తగా కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదవుతున్నాయని సీఎం అధికారులకు
చెప్పారు. అందువల్ల లాక్డౌన్ లాంటి నిబంధనలను అమలు చేయక తప్పదని, అవసరమైతే
ప్రభుత్వం ‘లాక్డౌన్’ ఆప్షన్ను ఎంచుకోక తప్పేలా లేదని ఉద్ధవ్ తెలిపారు.
ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోకుండా ఉండేలా లాక్డౌన్కు ప్రణాళికలు
రూపొందించాలని ఉద్ధవ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర
కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన
వైద్య శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో భాగమైన కోవిడ్-19 టాస్క్
ఫోర్స్ సభ్యులు రానున్న 24 గంటల్లో మహారాష్ట్రలో 40వేల కొత్త కరోనా కేసులు
నమోదయ్యే అవకాశం ఉందని సీఎంకు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపేకు
చెప్పారు. దీంతో.. పెరుగుతున్న కొత్త కరోనా కేసులకు సరిపడా వైద్య
సదుపాయాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఒక్కసారి లాక్డౌన్ ప్రకటించాక
ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉండకూడదని సీఎం చెప్పడం గమనార్హం.
ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు
సమూహాలుగా గుమిగూడవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు, రెస్టారెంట్లు, మాల్స్, గార్డెన్స్, బీచ్ సందర్శనలపై ఆంక్షలు
విధించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ నైట్ కర్ఫ్యూను
విధించింది. ఒక్క శనివారం రోజే మహారాష్ట్రలో 166 మంది కరోనా వల్ల ప్రాణాలు
కోల్పోయారు. 2021లో ఇప్పటిదాకా ఒక్కరోజులో ఇన్ని కరోనా మరణాలు మహారాష్ట్రలో
నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రజలు ఎంత చెప్పినా వినేలా లేరని భావిస్తున్న
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మరోసారి లాక్డౌన్ అమలుకు
సిద్ధమవుతున్నారు.