- పెండింగు సమస్యల సమాచారం క్రోడీకరణ
- సీఎస్ ఆఫీసు నుంచి సంఘాల నాయకులకు ఫోన్లు
న్యూస్ టోన్, అమరావతి: Joint Staff Council - ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు పొందిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ఫోన్లు వచ్చాయి. పెండింగు సమస్యల జాబితా పంపాలని వారిని కోరినట్లు తెలిసింది. ఇటీవలే ఏపీ ఎన్ జీ వో,జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. మిగిలిన గుర్తింపు సంఘాల నుంచి కూడా సమాచారం తీసుకుని క్రోడీకరిస్తున్నారని సమాచారం. ఈ నెల 18,19తేదీల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షెడ్యూలు ఆధారంగా తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. పీఆర్సీ పై అక్షోబరు నెలాఖరు లోపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు చెప్పిన నేపథ్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ ఎప్పుడు ఖరారవుతుందని ఉద్యోగ సంఘాలు ఎదురుచూస్తున్నాయి.