Inter Examinations: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలపై మంగళవారం కేబినెట్ భేటీలో చర్చ జరిగింది.
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈతో పాటు మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు. కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సబబు కాదని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. ఈ నిర్ణయంపై సాయంత్రం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పరీక్షల రద్దు, ఫలితాల విధానంపై ఇంటర్బోర్డు ప్రకటన చేయనుంది.