- రేపటినుంచి బడులకు వేసవి సెలవులు
- నేడు చివరి పనిదినం
న్యూస్ టోన్, తెలంగాణ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఆదివారం నుంచి వేసవి సెలవులుంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరం జూన్ 13వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో అకడమిక్ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడం, వేసవి సెలవులు ప్రకటించడమనే ప్రక్రియలు రెండేండ్లుగా జరగడం లేదు. రెండు విద్యాసంవత్సరాల తర్వాత ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడం గమనార్హం. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పాఠశాలలకు శనివారం చివరి పనిదినం. ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులిస్తారు. అంటే ఆదివారం నుంచి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులుంటాయి. మే 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తారు. అంటే పాఠశాలల్లో ఆ విద్యార్థులకు ప్రత్యేక తరగతులుంటాయి. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.