- అన్ని సంఘాలను పిలుస్తాం
- ఇవి అధికారిక చర్చలు కావు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించేదే అధికారికం
- వారు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే మాట్లాడాం
- ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడి
న్యూస్ టోన్, అక్టోబరు 13- Discussions Shortly on PRC: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు పీఆర్సీ అమలుకు సంబంధించి త్వరలోనే అధికారిక చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద బుధవారం మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఆయన అనేక విషయాలు వెల్లడించారు.
ఇప్పుడు జరుగుతున్నవి అధికారిక చర్చలు కావని అన్నారు. త్వరలోనే అన్ని సంఘాలను ఆహ్వానించి అధికారిక చర్చలుప్రారంభిస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాలు వినతి పత్రం తీసుకుని వస్తే వారితో మాట్లాడుతున్నామన్నారు. ప్రభుత్వం అన్ని ఉద్యోగ సంఘాలను ఒకేలా చూస్తుందని చెప్పారు. త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తారని అన్నారు. ఆయనతో జరిపే సమావేశమే అధికారికం అని వెల్లడించారు. ఆ సమావేశంలోఅన్ని సంఘాలకు మాట్లాడే అవకాశం ఉంటుందని సజ్జల చెప్పారు. ఉద్యోగ సంఘాల వ్యవహారంలో రాజకీయాలు చొప్పించాలని ఎవరైనా భావిస్తే వారే ఫూల్స్ అవుతారు అని అన్నారు. ఉద్యోగులను విడగొట్టి పబ్బం గడిపే ఆలోచన లేదన్నారు.