Undavalli Caves: తెలుగువారందరికీ గుర్తు వచ్చేవి గుహాలయాలు ఉండవల్లి. గుహాలయం ఒక పర్వత సముదాయం. ఈ గుహలు విజయవాడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. . ఒకే పర్వతాన్ని గుహలుగా మలచారు. పర్వత ముందు భాగమునుండి లోపలికి తొలచుకుంటూ వెళ్తూ.. మధ్యలో స్తంభాలు వాటిపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది.
ఉండవల్లి క్రీ.శ. 4, 5వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. దేవతా ప్రతిమలతోబాటు దాదాపు 20 అడుగుల ఏక శిలా అనంత పద్మనాభస్వామి, నాభిలో బ్రహ్మ, చుట్టూ దేవతా మూర్తులతో సహా చెక్కిన శిల్పుల చాతుర్యం చూడ గలిగినవారు అద్భుతం అంటారు.
ఒకే పర్వతాన్ని తొలచి 4 అంతస్తులుగా మలచారు ఈ గుహలని. మొదటి అంతస్తు బయట ఋషులు, సింహాలు విగ్రహాలున్నాయి. పైకి వెళ్తున్న కొద్దీ చిన్నవైన ఈ గుహలు పైన ఖాళీగానే వున్నాయి. కింద అంతస్తులో తాపసులు, భిక్షువులు కూర్చునేందుకు వీలుగా స్తంభాల మండపం వున్నది.
14వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు వేసిన ఒక శాసనం ప్రకారం ఈ గుహాలయాలు 3 లేక 7 వ శతాబ్దం నాటి విష్ణుకుండినుల కాలానివనీ, క్రీ.శ. 1343 లో అన్నారెడ్డి కుమారుడు పంచమ రెడ్డి అనంత పద్మనాభునికి అనేక కానుకలు ఇచ్చినట్లు తెలుస్తున్నది.
గుహాలయాలనుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనక దుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయంటారు. పూర్వం ఈ మార్గాలగుండా రాజులు శత్రు రాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారంటారు. ఇక్కడ వున్న ఒక సొరంగ మార్గం మూత పడి, పూడి పోయి వుంది.
ఈ గుహల నిర్మాణ శైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది. ఆలయాల చుట్టూరా పచ్చని పంటపొలాలు కనువిందు చేస్తాయి. ఈ గుహలు విజయవాడ నుండి 6 కి.మీ. దూరంలో, గుంటూరు నగరానికి 22 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాలలో ఇది ఒకటి. ఈ ప్రదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సర్వీసులను నడుపుతుంది