Trending

6/trending/recent

JVK: విద్యా కానుకలో క్రీడాదుస్తులు, బూట్లు

  • ఆట స్థలం లేని బడులకు భూమి కొనుగోలు
  • నాణ్యమైన విద్యాబోధనకే జాతీయ విధానం
  • ‘నాడు-నేడు’ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌

పిల్లలకు మంచి విద్యనందించాలని తపిస్తూ భారీగా డబ్బులు వెచ్చిస్తున్నాం. ముందు తరాలకు మేలు జరిగేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. సానుకూల దృక్పథంతో పనిచేయండి. నూతన విద్యావిధానంపై అందరిలో అవగాహన కల్పించండి.

-అధికారులతో సీఎం

JVK: వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా క్రీడా దుస్తులు, బూట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. జులై 1నుంచి రెండో విడత ‘నాడు-నేడు’ ప్రారంభించాలని, ఆటస్థలం లేని బడులకు భూమిని కొనాలని సూచించారు. విద్యా సంస్థలు, అంగన్‌వాడీల్లో ‘నాడు-నేడు’పై గురువారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో ప్రయోగశాలలు, గ్రంథాలయాలను బలోపేతం చేయాలని ఆదేశించారు. గ్రంథాలయాల్లో అంతర్జాల సదుపాయం ఉండాలని సూచించారు. మండలానికి ఒకటి, రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫౌండేషన్‌ పాఠశాలల విధానాన్ని అందరూ అనుసరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ‘ఐదో తరగతి వరకు 18 సబ్జెక్టులను ఒక ఉపాధ్యాయుడు నిర్వహించలేరు. ప్రతి సబ్జెక్టుకు ఒకరు ఉండాలి. ఫౌండేషన్‌ కోర్సులో ఇది చాలా అవసరం. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలు కోసం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన ఒక్క ఉద్యోగినీ తొలగించడం లేదు. ఒక్క కేంద్రాన్నీ మూసేయడం లేదు. పూర్వ ప్రాథమిక విద్య (పీపీఈ) 1, 2, ఒకటో తరగతికి సంసిద్ధత, ఒకటి, రెండు తరగతుల పిల్లలందరికీ కిలోమీటరు పరిధిలోనే పాఠశాల ఉంటుంది. మిగిలిన తరగతులు 3నుంచి 10వరకు సమీపంలోని ఉన్నత పాఠశాలల పరిధిలోకి తేవాలి. 3కిలోమీటర్లలోపు ఉండే ఉన్నత పాఠశాల పరిధిలోకి పిల్లలను తీసుకొచ్చే ప్రక్రియ ఎవరూ వేలెత్తి చూపేదిగా ఉండకూడదు. ఉపాధ్యాయుడు, విద్యార్థి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం ప్రధాన లక్ష్యం. ఎనిమిదేళ్లలోపు పిల్లల మానసిక వికాసం ముఖ్యం. వీరిలో వంద శాతం మెదడు అభివృద్ధి చెందుతుంది. ఈ వయసు పిల్లల నైపుణ్యాలను మెరుగుపర్చాలి. నాణ్యమైన విద్య, బోధన, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉపాధ్యాయులు, పిల్లలకు మంచి జరుగుతుందని చెప్పండి’ అని ముఖ్యమంత్రి సూచించారు.

వచ్చే సమావేశానికి కార్యాచరణతో రావాలి: ‘నూతన విద్యావిధానం అమలుకు చర్యలు, మౌలిక సదుపాయాల కల్పన, వ్యయ కార్యాచరణను వచ్చే సమావేశంనాటికి రూపొందించాలి. రెండేళ్లలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలి. ఆంగ్ల మాధ్యమం బోధించాలని ఆరాటపడుతున్నాం. నూతన విద్యావిధానంపై అందరిలో అవగాహన కల్పించండి. ఎవరికైనా సందేహాలుంటే తగిన సమయం కేటాయించి తీర్చండి’ అని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యారంగాల్లో సమూల మార్పులు తెస్తున్నామని.. ఐదేళ్లలో వెనక్కి చూసుకుంటే ఈ 3రంగాల్లో ప్రగతి కనిపించాలని సూచించారు. తెలంగాణ అధికారులు ఏపీకి వచ్చి ఇక్కడి పాఠశాలల్లో పనులను పరిశీలించారని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. తెలుగువారు ఎక్కడున్నా మంచి జరగాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. విద్యా కానుకలో భాగంగా ఇవ్వనున్న నిఘంటువును ఆయన పరిశీలించారు. సమావేశంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad