JVK Kit Krishna News: జేవీకే (జగనన్న విద్యా కానుక) కిట్ల పంపిణీకి రాష్ట్ర సమగ్ర శిక్షా ఎస్పీడీ కె.వెట్రిసెల్వీ సోమవారం జిల్లా ఎస్ఎస్ సీఎంవో, ఎమ్యీవోలు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలను విడుదల చేశారు.
2021-22 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జగనన్న విద్యా కానుక కిట్లను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ రకాల పాఠశాలలు మొత్తం 3,134 ఉన్నాయి.
తొలుతగా ఏకరూప దుస్తుల వస్త్రం..
ఒక్కో విద్యార్థికి మూడు జతల ఏకరూప దుస్తులు, నోటు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బ్యాగు, నిఘంటువులను కిట్ రూపంలో అందించాల్సి ఉంది. జిల్లాలోని బాపులపాడు, ఏ.కొండూరు, ఆగిరిపల్లి, బంటుమిల్లి, అవగనిగడ్డ, చల్లపల్లి మండలాలకు ఏకరూప దుస్తుల వస్త్రం సోమవారం చేరింది. జిల్లాలో 50 మండలాల్లోని 297 పాఠశాలల సముదాయాలకు విద్యా కిట్లను అంచెలంచెలుగా చేర్చనున్నారు. సరఫరా చేసిన వస్తువులను స్కూల్ కాంప్లెక్స్ లేదా భద్రతా ప్రమాణాలు ఉన్న పాఠశాలలో భద్రపర్చాల్సి ఉంటుంది. అందజేసిన వస్తువుల్లో ఏవైనా పాడైనవి, చిరిగినవి గుర్తిస్తే సంబంధిత మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలి. కిట్లు అందిన తరువాత తరగతివారీగా సెట్లుగా చేసి బ్యాగుల్లో పెట్టాలి. సంబంధిత మండల రిసోర్సు కేంద్రం నుంచి వస్తువులను కిట్ల రూపంలో పాఠశాలలకు చేర్చాలి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు, 6, 7 తరగతులకు, 8, 9, 10 తరగతులకు వేర్వేరుగా బ్యాగులు అందించాల్సి ఉంది. విద్యార్థులకు అందజేసేటప్పుడు జేవీకే యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. జేవీకే కిట్లను మండలాలకు, ఎమ్మార్సీలకు అంచెలంచెలుగా చేరుస్తామని సీఎంవో లంకె వెంకటేశ్వరరావు తెలిపారు. రోజుకు ఆరు మండలాలకు చొప్పున వస్త్రాన్ని పంపిణీ చేస్తామన్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా పంపిణీ బాధ్యతలను ఎమ్యీవోలు, ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు.