- ఇప్పటికే సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షలు రద్దు
- అధికారికంగా సమాచారం లేదంటున్న అధికారులు
- పరీక్షలు వాయిదా వేసి నెలరోజులు పూర్తి
Inter Examinations: ఇంటర్ నిర్వహిస్తారా? లేదా రద్దు చేస్తారా? అనే మీమాంసలో విద్యార్థుల వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలు పూర్తి కాగా ఇక మెయిన్ పరీక్షలు మాత్రం మిగిలి ఉన్నాయి. వాస్తవంగా గతనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తూ నిర్వహించాలని ఇందుకు ముందస్తు సన్నాహాలు చేసుకోవాలని ఇంటర్ బోర్డు ఆర్వో అధికారులు ప్రకటించారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోవడం, పరీక్షలు వాయిదా వేయాలని ఇటు ప్రజల నుంచి అటు ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో వాయిదా వేశారు. తాజాగా సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షలు కూడా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పరీక్షలపై ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 46,288 మంది, వృత్తివిద్యా విద్యార్థులు 1,752 మంది హాజరు కావాల్సి ఉంది. అదే విధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 49,681 మంది, వృత్తివిద్యా విద్యార్థులు 1,754 మంది హాజరౌతారని రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం కొవిడ్ నిబంధన ప్రకారం ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 60, గ్రామీణ ప్రాంతాల్లో 66 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో పక్కాగా శానిటైజేషన్ చేయాలని, విద్యార్థులు కేంద్రాల్లోకి ప్రవేశించే సమయంలోనే ధర్మల్స్ర్కీనింగ్ చేసిన తరువాత కేంద్రాల్లోకి అనుతించాలని ప్రణాళిక సిద్దం చేశారు. కొవిడ్ లక్షణాలుంటే సదరు విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు ప్రతి సెంటర్లో ఒక ఐసోలేషన్ కేంద్రం ఉండాలని సూచించారు. ఆ తర్వాత ప్రభుత్వం పరీక్షల్ని వాయిదా వేసింది. కాగా ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.
హాల్టిక్కెట్లు జారీ పూర్తి
విద్యార్థులు నేరుగా ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి హాల్టిక్కెట్లు డౌన్లోడు చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చనని తెలిపారు. విద్యార్థులను ఫీజుల కోసం యాజమాన్యాలు ఇబ్బంది పెట్టరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలా అన్ని ఏర్పాట్లు జరిగిన తరువాత మే నెల మొదటి వారంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి దాదాపు నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం రాలేదు. అధికారులు మాత్రం ఈనెల 10లోగా ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. పరీక్షలు ఉంటే కనీసం 15 రోజులు ముందుగా కళాశాలల యాజమాన్యాలకు, విద్యార్థులకు తెలియజేస్తామని చెబుతున్నారు.