CBSE Exams: సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ విషయమై సుప్రీంలో వాద ప్రతివాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంలో విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయమై తెలిసిందే. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలను విడుదల చేయాలని సీబీఎస్ఈ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బోర్డు కసరత్తు కూడా మొదలైంది. ఇంటర్నల్ మార్కులతో సంతృప్తి చెందని వారి కోసం ప్రత్యేకంగా పరీక్షను నిర్వహిస్తామని కూడా బోర్డు ప్రకటించింది.
ఇదిలా ఉంటే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 12వ తరగతీ పరీక్షలను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ఐఐటీ-జేఈఈ, సీఎల్ఏటీ పరీక్షలు భౌతికంగా నిర్వహిస్తుండగా, 12వ తరగతి పరీక్షలను ఎందుకు నిర్వహించలేరని పిటిషనర్ అన్షుల్ గుప్తా కోర్టును ప్రశ్నించారు. అయితే దీనిపై స్పందించిన కోర్టుల పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణ, రద్దు అంశాలపై బోర్డులు తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం స్పష్టం చేసింది. బోర్డులు విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. 13 మంది నిపుణుల సూచనల మేరకే సీబీఎస్ఈ బోర్డు నిర్ణయం తీసుకుందని సుప్రీం తెలిపింది. ఒక బోర్డు పరీక్షలు పెట్టిందని, మరో బోర్డును నిర్వహించమని ఆదేశించలేమని సుప్రీం స్పష్టం చేసింది.