- సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దుచేయాలన్న ఎస్ఈసీ
Elections: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 8న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దుచేస్తూ గత నెల 21న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ నీలం సాహ్ని ధర్మాసనానికి అప్పీలు చేశారు. స్థానిక ఎన్నికల విషయంలో నాలుగు వారాల ముందు ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) విధించాలని సుప్రీంకోర్టు చెప్పిందే గానీ.. గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో విధించాలని వేరుగా చెప్పలేదన్నారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయలేదనడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు.. వరుసగా నిర్వహించే స్థానిక ఎన్నికలకు వర్తిస్తాయన్నారు. ఎన్నికల ప్రక్రియ ఓ సారి మొదలయ్యాక న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు పలు తీర్పులిచ్చిందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రూ.150 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశామనే విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పోలింగ్కు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయలేదనే అభ్యంతరాన్ని జనసేన పార్టీ వ్యాజ్యంలో పేర్కొనలేదన్నారు. జనసేన పార్టీ పిటిషన్ ఆధారంగా సింగిల్ జడ్జి ఎన్నికలను రద్దుచేశారని తెలిపారు. సింగిల్ జడ్జి తీర్పులో తన గురించి దురుద్దేశాలు ఆపాదించారని, ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సింగిల్ జడ్జి తీర్పును రద్దుచేయాలని అప్పీల్లో అభ్యర్థించారు. ఈ అప్పీలు హైకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.