DSC Qualified 2008: సుదీర్ఘ పోరాటం ఫలించింది. పదమూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం లభించింది. డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కూడా డీఎస్పీ అభ్యర్థులతో పాటు సీఎంను కలిసి సమస్యను వివరించారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన సీఎం.. మినిమం టైం స్కేలు ఇచ్చి ఒప్పంద పద్ధతిలో తీసుకునేందుకు అంగీకరించారు. సీఎం నిర్ణయం మేరకు 2,193 మంది అభ్యర్థులను ఒప్పంద పద్ధతిలో విధుల్లోకి తీసుకోనున్నారు.
సీఎంతో సమావేశం అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎందరు సీఎంలు మారినా 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను పట్టించుకోలేదని, సీఎం జగన్... మానవతా దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కోర్టు కేసులతో సంబంధం లేకుండా ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత మేర సాయం చేస్తామని సీఎం చెప్పారని తెలిపారు.