- అంతకంటే ముందే ప్రైవేటు సంస్థల్లో చేరడం దుష్ప్రవర్తనే
- వారికి ఉద్యోగం ఇచ్చేముందు విజిలెన్స్ క్లియరెన్స్ తీసుకోండి
- కేంద్ర శాఖల కార్యదర్శులు, బ్యాంకులకు సీవీసీ ఉత్తర్వులు
Cooling Period: పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులు ‘కూలింగ్ పీరియడ్’ నిబంధన పాటించకుండా వెంటనే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు చేపట్టడం తీవ్రమైన దుష్ప్రవర్తన కిందకే వస్తుందని కేంద్ర విజిలెన్స్ కమిషన్ పేర్కొంది. రిటైరైన వారికి ఉద్యోగాలు ఇచ్చేముందు అన్ని సంస్థలు విజిలెన్స్ క్లియరెన్స్ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు గురువారం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ సంస్థల నుంచి పదవీ విరమణ చేసిన వెంటనే సదరు ఉద్యోగులు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఫుల్టైం/కాంట్రాక్టు ఉద్యోగాల్లో చేరుతున్నట్లు గుర్తించామని కమిషన్ పేర్కొంది. ప్రైవేట్ సంస్థల ఆఫర్లను స్వీకరించే ముందు కూలింగ్ పీరియడ్ నిబంధనను కచ్చితంగా పాటించేలా ఉద్యోగులకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే రిటైర్డ్ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని సీవీసీ హెచ్చరించింది. రిటైర్డ్ అధికారి ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పనిచేసి ఉంటే పదవీ విరమణకు పదేళ్ల ముందు పనిచేసిన అన్ని సంస్థల నుంచి విజిలెన్స్ క్లియరెన్స్ పొందాలని స్పష్టం చేసింది