China – Delta Variant: కరోనా డెల్టా వేరియంట్ భయంతో చైనా వణికిపోతోంది. డెల్టా వేరియంట్ దేశంలో వ్యాప్తిస్తే తీవ్ర నష్టం తథ్యమని ఆందోళన చెందుతోంది.
ఆ మేరకు ఈ వేరియంట్ దేశంలో వ్యాపించకుండా పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. గ్యాంగ్జూహూలో మే21న తొలి డెల్టా వేరియంట్ కేసు నమోదయ్యింది. ఓ రెస్టారెంట్ కు వెళ్ళిన 75 ఏళ్ల మహిళకు డెల్టా వేరియంట్ సోకినట్లు గుర్తించారు. జూన్ 8 వరకు గ్యాంగ్ జూహూ పట్టణంలో 115 డెల్టావేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ డెల్టా వేరియంట్ను మొదటగా భారత్ లోనే గుర్తించారు. దేశంలో సెకండ్ వేవ్కు ఇదే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా వేరియంట్లు పుట్టుకొచ్చినా…భారత్లో మొదటగా గుర్తించిన డెల్టా వేరియంట్ చాలా శక్తివంతమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఆందోళన వ్యక్తంచేసింది.
డెల్టా వేరియంట్ కేసులు తమ దేశంలోనూ నమోదుకావడం పట్ల చైనా ఆందోళన చెందుతోంది. వైరస్ లక్షణాలు తెలిసిన వెంటనే గ్యాంగ్ జూహూ నగరంలో లాక్డౌన్ విధించింది. ఆ దేశంలో 27 మిలియన్ల ప్రజలకు మూకుమ్మడిగా కరోనా పరీక్షలు నిర్వహించారు. జనం భారీ క్యూలైన్లలో నిల్చొని కొవిడ్ పరీక్షలు చేయించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు కఠిన కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించని వారిని గుర్తించి పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పశ్చిమ గ్యాంగ్జూహూలోని లివాన్ ప్రాంతంలో డెల్టా వేరియంట్ ఉనికిని నిపుణులు గుర్తించారు. తక్షణమే లివాన్ లో లాక్డౌన్ విధించి షాపులు ,రెస్టారెంట్లు మూసివేయించారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు డెల్టా వేరియంట్ విస్తరించకుండా కఠిన చర్యలు చేపట్టారు. మెట్రోస్టేషన్ల మూసివేతతో పాటు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.గ్యాంగ్జూహూ ఇంటర్నెషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దుచేశారు. లివాన్ పట్టణంలో డ్రైవర్ లెస్ కార్ల ద్వారా సరకులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేశారు.
భారీ క్యూలైన్లలో నిలబడి పరీక్షలు చేయించుకుంటున్న చైనా ప్రజలు..
If you want to know how Shenzhen tests 20 Million people in 3 days: pic.twitter.com/HzztsAYS9E
— Pilou (@p_ilou) June 7, 2021
ప్రమాద కారి డెల్టా వేరియంట్
ప్రపంచంలో డెల్టా వేరియంట్ (B.1.617.2) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 60 దేశాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. 2020లో బ్రిటన్లో మొదటగా గుర్తించిన ఆల్ఫా వేరియంట్ కన్నా డెల్టా వేరియంట్ ప్రమాదమని నిపుణులు హెచ్చరించారు. డెల్టా వేరియంట్ సోకిన వారిలో వినికిడి సమస్య, కడుపులో గ్యాస్,రక్తం గడ్డలు కట్టడం, పుండ్లు ఏర్పడే లక్షణాలున్నాయి. మనదేశంలో రెండో దశ ఉధృతికి డెల్లా వేరియంట్ కారణమని నిపుణులు చెబుతున్నారు. డెల్లా వైరెంట్ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ కలిగిన చిన్నారులకు కూడా సోకుతుందని హెచ్చరిస్తున్నారు. కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకా డోసులు వేసుకున్నా సరే డెల్టా వేరియంట్ సోకే ప్రమాదముంది. ఆ మేరకు ఎయిమ్ ఢిల్లీ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) ప్రత్యేక అధయ్యనంలో వెల్లడయ్యింది. బ్రిటన్లో బయటపడ్డ అల్ఫా వేరియంట్ కన్నా ఈ డెల్టా వేరియంట్.. 40 నుంచి 60 శాతం శక్తివంతమైనదిగా నిర్ధారించారు. భారత్లో ఎక్కువ కరోనా ఇన్ఫెక్షన్ల వెనుక దీని ప్రభావం ఉందని ఎయిమ్స్ వెల్లడించింది.