Covid 19 Death Audit Report: రాష్ట్రంలో సంభవించిన కరోనా మరణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెత్ ఆడిట్ నిర్వహించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆడిట్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. కరోనా సెకండ్ వేవ్లో 30 నుంచి 50 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా చనిపోతున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా 41 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు అధికంగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా, 60 నుంచి 80 ఏళ్ల వయసున్న వారిలో కరోనా మరణాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. కాగా, కరోనా ప్రభావం పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ సమానంగా ఉన్నాయని, కరోనా ప్రభావంతో పల్లెల్లో 49.6 శాతం మరణాలు సంభవించగా.. అర్బన్ ప్రాంతంలో 50.4 శాతం మరణాలున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలాఉండగా.. గత ఏడాది మొదటి వేవ్తో పోలిస్తే 41-50 మధ్య వయస్కుల్లో 5.96 శాతం మేర కరోనా మరణాలు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక 31-40 సంవత్సరాల మధ్య 5.19 శాతం మేర కరోనా మరణాలు పెరిగాయి. 51-60 ఏళ్లలో 2.04 శాతం మేర కరోనా మరణాలు పెరిగాయి. ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వారిలో కరోనా మరణాలు తగ్గాయని అధికారులు తెలిపారు. 61-70 వయస్సు గల రోగులలో 6.11 శాతం మేర కరోనా మరణాలు తగ్గాయి. 71-80 వయస్సులో 4.90 శాతం మేర మరణాలు తగ్గాయి. 80 ఏళ్లు పైబడిన వారిలోనూ 1.37 శాతం మేర మరణాలు తగ్గాయి.