ZPTC, MPTC Elections : ఆంధ్రప్రదేశ్ లో ఆగిపోయిన ZPTC, MPTC ఎన్నికలపై వచ్చీ రాగానే ఫుల్ ఫోకస్ పెట్టారు కొత్త SEC నీలం సాహ్ని. బాధ్యతలు తీసుకున్న వెంటనే పని మొదలు పెట్టేశారు. గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆ వెంటనే CS ఆదిత్యనాధ్ దాస్ ని కలిసి పరిషత్ ఎన్నికలపై చర్చించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్కు ఈ ఎన్నికలు అడ్డంకిగా ఉన్నాయి కావున వెంటనే నిర్వహించాలని కోరారు. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబుతో సమీక్ష చేశారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం కలెక్టర్లు, SPలతో వీడియో కాన్ఫరెన్స్ ఫిక్స్ చేశారు నీలం సాహ్ని.
అటు, సీఎం జగన్ సైతం పరిషత్ ఎన్నికలపై స్పందించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్కు ఇబ్బంది ఉందని, కొత్త SEC వచ్చారు కాబట్టి త్వరగా ఎన్నికలను నిర్వహిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల వ్యవహారం హైకోర్టులో ఉంది కాబట్టి సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నారు కొత్త SEC నీలం సాహ్ని. కాగా, ఏపీ కొత్త SEC గా ఈ ఉదయం సాహ్ని బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.