బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ(State Bank Of India) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో నెలకు నాలుగు కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే వసూలు చేసిన ఛార్జీలను తిరిగి రీఫండ్ చేసినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ(SBI) తాజాగా కీలక ప్రకటన చేసింది. జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో నాలుగు కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిపితే విధించిన ఛార్జీలను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది.
నాలుగు లావాదేవీలు మించి చేసిన డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను రిఫండ్ చేసినట్లు చెప్పింది. పరిమితికి మించిన లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడానికి ఆర్బీఐ 2012 ఆగస్టులో వెసులుబాటు కల్పించిందని బ్యాంకు తెలిపింది.
ఈ నేపథ్యంలో బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్(బీఎస్బీడీ) ఖాతాదారులు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత జరిపే ట్రాన్సెక్షన్స్పై ఛార్జీలు వసూలు చేసినట్లు బ్యాంకు వివరించింది. ఖాతాదారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి.. 2016 జూన్ 15 నుంచి ఈ ఛార్జీలను వసూలు చేసినట్లు బ్యాంకు వివరించింది.
అయితే.. 2020 జనవరి 1 తర్వాత డిజిటల్ లావాదేవీలపై విధించిన ఛార్జీలను తిరిగి ఖాతాదారులకు చెల్లించాలంటూ 2020 ఆగస్టులో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసినట్లు బ్యాంకు చెప్పింది.
డిజిటల్ లావాదేవీలపై భవిష్యత్ లోనూ ఛార్జీలు విధించవద్దని సీబీడీటీ బ్యాంకులకు సూచించిందని తెలిపింది. సీబీడీటీ ఆదేశాల మేరకు 2020 జనవరి 1 నుంచి 2020 సెప్టెంబర్ 14 వరకు జీరో బ్యాలెన్స్ ఖాతాదారుల డిజిటల్ లావాదేవీలపై విధించిన ఛార్జీలను రిఫండ్ చేసినట్లు ఎస్బీఐ తెలిపింది.
సెప్టెంబర్ 15, 2020 తర్వాత నెలలో నాలుగు కన్నా ఎక్కువగా నిర్వహించిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని బ్యాంకు స్పష్టం చేసింది.