Jagananna Smart Town: సామాన్యులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడంలో భాగంగా జగన్ సర్కార్ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఈ మేరకు ‘జగనన్న స్మార్ట్ టౌన్’ పధకానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ నగరపాలిక సంస్థ(వీఎంసీ) పరిధిలోని అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ళ స్థలాలను అందించడంలో భాగంగా తాజాగా వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
విజయవాడ నగరపాలిక సంస్థ పరిధిలోని ఐదు కిలోమీటర్ల దూరంలో అన్ని వసతులతో కూడిన ఇళ్ళ స్థలాలను అభివృద్ధి చేసి ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చెప్పుకొచ్చారు. డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్, విద్యుత్ సౌకర్యం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు ఇలా అన్ని మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. కాగా, సంవత్సరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 18 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఈ పధకానికి అర్హులని.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పధకానికి దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.
ఈ పధకం గురించి మరిన్ని వివరాలు…
- 150 చదరపు గజాల స్థలం పొందాలంటే.. ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల ఆదాయం
- 200 చదరపు గజాల స్థలం… ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయం
- 240 చదరపు గజాల స్థలం… ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల ఆదాయం
ఎలా అప్లై చేసుకోవాలో చెప్పనే లేదు కదా సార్?
ReplyDelete