AP Tenth, Inter Exams: నేడు పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పరీక్షల నిర్వహణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయా ? లేక కరోనా తీవ్రత కారణంగా రద్దవుతాయా ? అన్న దానిపై కొద్దిరోజులుగా డైలమా కొనసాగుతోంది.
కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు సైతం పరీక్షలను రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంటుందని చాలామంది భావించారు.
కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పదో తరగతి, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రకటించింది. దీనిపై ఏపీలోని పలు రాజకీయ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని.. పరీక్షలను వాయిదా లేదా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.
దీనిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్ ప్రకటించారు. దీంతో ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయనుందనే ప్రచారం జరిగింది.
అయితే నేడు పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పరీక్షల నిర్వహణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులకు నష్టం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
పరీక్షల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం చూపొద్దని ఆయన అధికారులను ఆదేశించారు.