ఏపీలో ఇసుక దుమారానికి బ్రేకులు పడేది ఎప్పుడు. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్, ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇకపై ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రైవేటు సంస్థ చేపడుతోంది. మరి ఇది వివాదాలకు దారితీస్తుందో? సక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందో చూడాలి.
ఏపీలో ఇసుక దుమారం ఇంకా ఆగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత కారణంగా చాలావరకు నిర్మణాలు నిలిచిపోయాయి. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. దీనికితోడు కరోనా ఎఫెక్ట్ దీంతో రియల్ వ్యాపారం కూడా బాగా దెబ్బతింది. తాజాగా రాష్ట్రంలో ప్ర్రైవేటు సంస్థకు ఇసుక విక్రయాలు అప్పచెప్పడం పెను దుమారమే రేపింది. రాష్ట్రంలో అన్ని విపక్షాలు ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ప్రైవేటు సంస్థకు ఇసుక అమ్మే ఛాన్స్ ఇస్తే సమాన్యులకు ఇసుక అందుబాటులో ఉండదని.. భారీగా రేట్లు పెరుగుతాయని విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ప్రభుత్వం ఆ విమర్శలను పట్టించుకోలేదు. అన్ని జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండర్ ను జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కు అప్పగించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు సంస్థ ద్వారా ఇసుక విక్రయాలు ఈ నెల 16 నుంచి మొదలు కానున్నాయి. ఆ సంస్థకు అన్ని ఓపెన్ రీచ్లు అప్పగించాలని గనులశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అన్ని జిల్లాలో ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండర్ను జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే సంస్థ దక్కించుకుంది. తాజాగా ఇసుక విక్రయాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఇప్పటికే సెక్యూరిటీ డిపాజిట్ కింద 120 కోట్ల
రూపాయలు జమ చేసింది. రెండేళ్ల పాటు ఇసుక తవ్వకాలు, విక్రయాలపై ఇవాళ లేద
రేపు గనుల శాఖతో ఒప్పందం చేసుకోనుంది. 15 రోజుల పాటు విక్రయించే ఇసుకకు
సంబంధించి ముందుగానే ప్రభుత్వానికి 31 నుంచి32 కోట్లు చెల్లించాల్సి ఉండగా,
ఆ మొత్తాన్ని కూడా చెల్లించనుంది. ఆ వెంటనే ఈ నెల 16 నుంచి ఇసుక బాధ్యతలు
చేపడుతుందని గనుల శాఖ వర్గాల సమాచారం.
ఇసుక కావాలంటే ఏం చేయాలి?
రీచ్ గానీ, దాని సమీపంలో ఏర్పాటు చేసుకున్న నిల్వ కేంద్రం వద్ద టన్ను 475 రూపాయలకు మించకుండా ఆ సంస్థ విక్రయించాల్సి ఉంటుందని, ఆన్లైన్ బుకింగ్ లేకుండా ఎవరైనా నేరుగా అక్కడికి వెళ్లి ఇసుక తెచ్చుకోవచ్చని పేర్కొంటున్నారు. 16 లోపు ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్నవారికి ఏపీఎండీసీ ద్వారా సరఫరా చేయనున్నారు. కొత్త సంస్థ బాధ్యతలు తీసుకున్నాక.. అప్పటికే ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారికి ఇసుక సరఫరా జరగకపోతే, వాటిని రద్దుచేసి ఆయా బుకింగ్దారులకు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారని తెలుస్తోంది.
అలాగే
నదుల్లో ఓపెన్ రీచ్లను కొత్త సంస్థకు అప్పగించాలని గనులశాఖ
ఉన్నతాధికారులు ఆయా జిల్లాల అధికారులకు మొన్ననే ఆదేశాలు అందాయి. కొత్త
రీచ్లను గుర్తించడమే కాకుండా, వాటికి అన్ని అనుమతులు లభించేలా చూడాలని ఆ
ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతి రీచ్, నిల్వ కేంద్రం, డిపోలను గనులశాఖ
అధికారి, జిల్లా ఇసుక అధికారి, ప్రైవేటు సంస్థ ప్రతినిధి సంయుక్తంగా
పరిశీలించి.. ఇసుక నిల్వ వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఆ ఇసుకకు
చెందిన మొత్తాన్ని ప్రైవేటు సంస్థ, ఏపీఎండీసీకి ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలు, రవాణా చేసిన గుత్తేదారులకు ఏపీఎండీసీ తొలగింపు
నోటీసులు జారీ చేయనుంది. నదులు, వాగులు, వంకల సమీప గ్రామాలకు చెందినవారు
సొంత అవసరాలకు ఎడ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తరలించుకునేలా ప్రభుత్వం గతంలో
ఇచ్చిన ఆదేశాలకు ప్రైవేటు సంస్థ కట్టుబడి ఉండాలని ఆదేశించారు.
అయితే
ప్రైవేటు సంస్థకు ఇసుక బాధ్యతలు అప్పగించిన కారణంగా కాంట్రాక్టు ఉద్యోగుల
భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు ఏపీఎండీసీ పరిధిలో రీచ్లు,
నిల్వ కేంద్రాల్లో పనిచేసే పొరుగు సేవల సిబ్బంది ఇక అవసరం లేదంటూ సంబంధిత
ఏజెన్సీకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో సుమారుగా రెండు వేలకుపైగా
ఔట్ సోర్సింగ్ సిబ్బంది రోడ్డున పడ్డట్టే అవుతుంది. అయితే కొత్త ప్రైవేటు
సంస్థ ఇందులో ఎంతమంది సేవలు వినియోగించుకుంటుందో చూడాలి.. ప్రభుత్వం మాత్రం
వారి సేవలు ఉపయోగించమని సూచనలు చేస్తోంది.