Electricity Charges in AP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నూతన విద్యుత్ ఛార్జీలను (Electricity Charges) ఏపీఈఆర్సీ ప్రకటించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో నూతన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యుత్ ఛార్జీలను ఈఆర్సీ ప్రకటిచింది. రాయితీలను తగ్గించకుండా.. చిన్నచిన్న మార్పులతో కొత్త విద్యుత్ టారిఫ్ ను ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి ప్రకటించారు.
నూతన టారిఫ్ లో ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఇకపై కనీస ఛార్జీలు ఉండవని ప్రకటించింది. కనీస ఛార్జీల స్తానంలో ఇకపై కిలో వాట్ కు రూ.10 చెల్లిస్తే సరిపోతుందని నాగార్జున రెడ్డి తెలిపారు. అలాగే సగటు యూనిట్ ధర రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గిస్తున్నట్టు నాగార్జున రెడ్డి వెల్లడించారు.
ఇక ఎస్సీ, ఎస్టీ కాలనీలు, కులవృత్తులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కొనసాగనుంది. దీని వల్ల ప్రభుత్వంపై రూ.1,657 కోట్ల భారం పడనుంది. అలాగే ఫంక్షన్ హాళ్లకు ఇకపై ఫిక్స్డ్ ఛార్జీలుండవని నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు.
ఉచిత విద్యుత్ కేటగిరీ విషయానికి వస్తే గిరిజనులు, ఎస్సీ కాలనీల్లో నెలకు 200 యూనిట్లు, లాండ్రీలు నడుపుతున్న రజకులకు నెలకు 150 యూనిట్లు, చేనేత కార్మికులు, బీపీఎల్ కింద ఉన్న స్వర్ణ వృత్తికారులకు నెలకు 100 యూనిట్లు, అత్యంత వెనుకబడిన వర్గాలకు నెలకు 100 యూనిట్లు ఉచితంగా ఇవ్వనున్నారు.
పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చే అవకాశం లేదని నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు. ఇక రైతులకు ఉచిత విద్యుత్ పథకం కింద రూ.7,297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఆయన తెలిపారు.
ప్రతి ఏటా డిస్కమ్ లకు రూ.11,741.18 లోటు వస్తుందని.., ఇందులో రూ.4,307.38 కోట్ల భారం వినియోగదారులు, ప్రభుత్వంపై పడకుండా ఉండే ప్రతిపాదనలను ఆమోదించినట్లు తెలిపారు.