- కొనసాగుతున్న ఉపాధ్యాయుల దరఖాస్తుల పరిశీలన
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్రవ్యాప్తంగా 75,718 మంది దరఖాస్తు చేశారు. వీరిలో తప్పనిసరి బదిలీ అయ్యేవారు 24,535 మంది ఉండగా.. రెండేళ్లు పూర్తి చేసుకుని అభ్యర్థన బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారు 51,183 మంది ఉన్నారు. దరఖాస్తుల పరిశీలన బుధవారం రాత్రి వరకు జరగనుంది. ప్రాథమిక సీనియారిటీ జాబితాను ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జిల్లాల వారీగా అందుబాటులో ఉంచనున్నారు.
ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రస్తుతం పట్టణాలు, నగరాలకు సమీపంలో పని చేస్తున్న వారిలో సుమారు 10వేల మంది మారుమూల ప్రాంతాల్లోని కేటగిరీ-3, 4లోని బడులకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసిన వారిలో సుమారు 8వేల మంది హేతుబద్ధీకరణ కారణంగా పోస్టులు కోల్పోయినవారు ఉన్నారు.
ఆన్లైన్ వద్దు: జాక్టో
ఉపాధ్యాయుల బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని కోరుతూ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) ఛైర్మన్ జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్రెడ్డి మంగళవారం కలిసి వినతిపత్రాలు సమర్పించారు. పోస్టుల ఖాళీలన్నింటినీ చూపించాలని, 2019 జూన్ నుంచి ఇచ్చిన పదోన్నతులు, ఉన్నతీకరించిన భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయ స్థానాలను ఖాళీలుగా చూపించాలని, సర్వీసు పాయింట్లను ఏడాదికి ఒకటి చొప్పున కేటాయించాలని కోరారు.